Friday, June 11, 2010

భారత రామాయణాలపై సినీ విషం

"దుశ్శాసనా...! నువ్వు ఈ పాండవులతో పాటూ ద్రౌపదీ దేవి ధరించిన వస్త్రాలు విప్పెయ్యి"..
మహాభారతంలో అత్యంత ఘోర అకృత్యానికి విషబీజాల్లాంటి మాటలివి.ఈ ఆఙ్ఞ ఇచ్చింది సాక్షాత్తూ దానవీరశూరుడనుకునే కర్ణుడు.
మరి ఇదేనా శూరత్వం ఇదేనా వీరత్వం.కర్ణుడికి గొప్పదనం ఆపాదించే వారికి మహాభారతానికి హృదయం లాంటి ఘట్టంలో అతని నైచ్యం కనిపించలేదా..? లేక వారి దృష్టిలో బలాత్కారాలు చేయించే వారే మహానుభావులా..?
"మంత్రీశ్వరా ఎంత వెర్రి వాడయ్యా...!చేతికి చిక్కిన సీతని ఊరికే వదిలేందుకు నేనేం మూర్ఖుడిని అనుకున్నావా?పూర్వం బ్రహ్మ మానస పుత్రిక ఒకతెను నేను బలవంతంగా అనుభవించాను.అందుకు అది బ్రహ్మచే ఏ స్త్రీనైనా బలవంతంగా అనుభవిస్తే తక్షణమే మరణిస్తానని శాపమిచ్చేలా చేసింది.అందుకే సీతను నయానో భయానో ఒప్పించాల్సి వస్తోంది". ఈ మాటలు సీతను ఎందుకు బతిమాలుకుంటావు వెళ్ళి కుక్కుట వృత్తితో(కోడి పెట్ట పుంజును అనుభవించినట్టుగా) బలాత్కరించి అనుభవించమని సలహా ఇచ్చిన మంత్రితో రావణుడు అన్నవి.
"కలిసి కాపురం చేసిన భార్యను అనుమానించిన రాముడు గొప్పవాడా..?ఆర్నెల్లు తనవద్దనే ఉన్నా సీతను తాకని రావణుడు గొప్పవాడా..?"లాంటి డైలాగులు రాసిన వాళ్ళూ ఆ పాయింట్ మీద సినిమాలు తీసిన వాళ్లూ సీతను తాకకపోవడానికి రావణుడి నైతికత కారణం కాదు..కేవలం బలాత్కరిస్తే చస్తాడని శాపం కారణమని తెలియదా?రావణుణ్ణి హీరోని చేసేసేముందు పై వాక్యం చదివే(లేదా చదివించుకునే) ఓపికా తీరికా లేకపోయాయా?
పై రెండూ మన సినిమాలు భారత రామాయణ పాత్రలను ఎలా ఇష్టం వచ్చినట్టు మార్చేశాయో...ఎంతగా ఆ ఇతిహాసాలపై విషం కక్కాయో తెలిపేందుకు చిన్న ఉదాహరణలు.ఎందుకు అలా చేస్తున్నారన్నది ఆలోచించాల్సిన విషయం.
మహాదాతలైనా...మహావీరులైనా...మహాభక్తులైనా..ధర్మం తప్పితే ఎలా పతనమిపోతారో చెప్పే పాఠాలు రావణ,కర్ణ పాత్రలు. రావణుడు శివ దర్శనానికి వెళ్లగా నంది అడ్డుకుంటుంది.కైలాస గిరిని పెకలించబోయి భంగపడి పేగులతో రుద్రవీణ వాయించి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు.అందుకు ఆగ్రహించి నంది శపిస్తుంది.ఇది రావణ స్వభావం.
నంది(వృషభం) ధర్మ స్వరూపం.ధర్మాన్ని అతిక్రమించిన వాడి భక్తి ప్రమాదకరమని సంకేతం అది.శివలింగాన్ని దర్శించేందుకు నంది అనుమతి తీసుకోవాలి...నంది కొమ్ముల్లోంచి శివ దర్శనం చేసుకోవాలి అనే ఆచారాల్లో అదే ధర్మ సూక్ష్మం ప్రతిఫలిస్తుంది.
అదంతా వేరే విషయం లెండి ఇంతకీ విషయానికి వస్తే,ఇలాంటి సూక్ష్మాల్ని రావణునికీ,కర్ణునికీ లేని గొప్పను ఆపాదించి మనకు దూరం చేసారు సినిమహానీయులు.
గతంలో మన తాతముత్తాతలందరికీ సంస్కృత వాఙ్మయమో,ఆంధ్రానువాదమో,హరికథలో,వీధి భాగోతాలో,యక్ష గానాలో,స్త్రీల పాటలో వారివారి అభిరుచి స్థాయిని బట్టీ రామాయణ భారత భాగవతాల ద్వారా వేద స్ఫూర్తితో ధర్మాం అర్ధం కామం మోక్షం ఎలా సాధించాలో చెప్పేవి.వేద వాఙ్మయం నుండి స్త్రీల పాటల వరకు ఒకే సంస్కృతి ధార ప్రవహించేది.
ఆ వినోదాలు బతికుంటే ఈ తప్పుడు ప్రచారాలు వాటిని గమనిచలేని దౌర్భాగ్యం ఉండేది కాదు.చెక్క భజనలూ,కోలాటాలూ,వీధి భాగోతాలూ,హరికథలూ,సప్తాహాలూ తర్వాత తర్వాత వచ్చిన నాటకాల్నీ మొత్తంగా సినిమాలు మింగి త్రేంచేసాయి.అమ్మలాంటి సంస్కృతికి మనల్ని దూరంచేసింది సినిమా.అదే సినిమా ఇలా రాక్షసుల్నీ నీచుల్నీ మహానుభావులుగా చెప్తూ గన్నేరుపప్పు కూర చేసి గోరుముద్దలు పెడుతోంది మనకు.
నిజానికి రామాయణ భారతాదులు మనకు పరిచయం చెయాల్సినది అమ్మ..ఆ పరిచయాన్ని విస్తృత పరచాల్సింది గురువు..లోతుపాతుల్లోకి నడపాల్సింది గ్రంధపఠనమో కథా కాలక్షేపమో అంతే గానీ విశ్వ విఖ్యాత సినీ రాకాసులు కాదు.
ఈనాటి దౌర్భాగ్యానికి కారణం మనకు మూలాలు అవగాహన లేకపోవడం.సంస్కృతం వచ్చిన వాళ్లతో వ్యాసవాల్మీకి విరచితాలు చెప్పించుకోండి...కవిత్రయాదుల తెలుగు అనువాదాలు చదువుకోండి...కనీసం తేట తెలుగులో శిరోమణి"రామాయణం",ఉషశ్రీ"భారతం" చదవండి. ఆ తర్వాతే విషవృక్షం చదివినా దానవీరశూర కర్ణ చూసినా.

Monday, February 2, 2009

తెనాలి రామలింగడి ఎదురు దెబ్బ


తెనాలి రామలింగడి గురించి మన అందరికీ తెలిసిందే.ఆయన వికట కవిత్వపు దెబ్బకి పెద్దన లాంటి పెద్దలే అబ్బా అనకతప్పలేదు.అటువంటి రామలింగణ్ణే అభాసుపాలు చేయబోయాడు ఒకనాడు ధూర్జటి కవీశుడు.


ఒకనాడు ముక్కు తిమ్మన ఇంట్లో ఎదో శివ పూజకు అష్ట దిగ్గజాల్లో శివ భక్తులందరూ వెళ్ళారు.పూజానంతర తీర్ధ ప్రసాదాలు స్వీకరించారంతా.వారి గౌరవార్ధం ఇచ్చిన విందు భోంచేసి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.భుక్తాయాసం వల్ల రామలింగడూ,ధూర్జటీ తిమ్మన గారి ఇంట్లోనే ఉండిపోయారు.తాంబూలాలు వేసుకుంటూ రామలింగని వేళాకోళాల్లొ తడిసి ముద్దౌతున్నారు.

తిమ్మన గారు ఉయ్యాల బల్లలో ఉయ్యాల ఊగుతున్నాడు.ధూర్జటీ,రామలింగడూ నేలపై వేసిన పట్టు పరుపు మీద కూర్చున్నారు.ఈ లోపు రామలింగడు తిమ్మనతో

"మామా ఊతునా(ఊపనా)"అన్నాడు

ఉయ్యాల ఊపుతాడు కాబోలునని "సరే"నన్నడు తిమ్మన.ఊతునా అన్న మాటకి ఉయ్యనా అన్న అర్ధం తీసి వికట కవి వర్యుడు నోట్లో ఉన్న తాంబూలం తిమ్మన కాలిపై తుపుక్కున ఊశాడు నవ్వుతూ.అసహ్యకర హఠాత్పరిణామానికి తిమ్మన కాలు విసురుగా అప్రమేయతతో లేచింది.అది బలంగా రామలింగడి మూతికి తగిలి ముందు పన్ను రాలి పడింది.జరిగినదానికి రామలింగడు లెక్కపెట్టక నవ్వుతున్నా,ధూర్జటీ,తిమ్మన చాలా బాధపడ్డారు.ముఖ్యంగా తిమ్మన శివ పూజార్ధియై వచ్చిన వాడి రక్తం కళ్ళ చూసానే అని ఎంతో బాధ పడ్డడు. తర్వాత రోజే రామలింగడు దుప్పి కొమ్ము పన్నులా కోయించి ఖాళీ ఐన పన్ను స్థానంలో ఇరికించాడు.అది ఎంతగా ఇమిడిపోయిందంటే ధూర్జటే నమ్మలేకపోయాడు.

************

తరువాత రోజు భువన విజయంలో "నక్కీరుని కథలో శివుని పద్యం దోష భరితమా కాదా?'అన్న విషయంపై రసవత్కరమైన చరచ జరిగింది ఆ సభలో ధూర్జటి అమోఘంగా ఉపన్యసించాడు.పెద్దనాదులు,తమిళ,కన్నడ కవివర్యులు ధూర్జటిని పొగడ్తలతో ముంచెత్తారు.

ఇది రామలింగడికి అంత రుచించలేదు.ప్రతిభా వ్యుత్పత్తి సాధనల్లో తనకు సాటి రాలేని వేశ్యా లోలత్వాన్ని అదుపులో పెట్టుకోని ధూర్జటికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం అతనికి నచ్చలేదు.


రాయల వారు ప్రసంగిస్తూ ధూర్జటిని ఎంతగానో పొగిడి "రవి గాననిచో కవి గాంచునే కదా" అన్న సమస్యనిచ్చి పూరించమన్నారు.పెద్దనాదుల తరువాత రామలింగడు ధూర్జటిని చాయా మాత్రంగా వేళాకోళం చేస్తూ పద్యం పూరించాడు.
దాంతో కోపమొచ్చి ధూర్జటి ఆ సమస్యను ఇలా పూరించాడు

ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసినోటికిన్
నేరడు రామలింగకవి నేరిచెపో మన ముక్కుతిమ్మరాట్
కౄర పదాహతిం తెగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము ప

ల్గా రచియించినాడు రవి గాననిచో కవి గాంచునే కదా

భావం: పూర్వం దక్ష యాగం ధ్వంసం చేసేటప్పుడు వీరభద్రుని కాలి దెబ్బలకు పళ్ళు ఊడినా రవి బోసి నోటితో కాలం గడిపేస్తున్నాడు.కాని మన రామలింగ కవి ముక్కు తిమ్మన కాలు తగిలి ఊడిన పన్నుకు బదులు దుప్పికొమ్ము పలుకు పెట్టుకున్నాడు.కనుక రవి కాననిచో కవి కాన్చును.
పద్యం పూర్తి కాగానే సభలో అందరూ రామలింగడి పలువరుస చూస్తూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు.రహస్యం ఇలా బట్టబయలైనందున కోపంగా ఉన్నా చేసేదేం లేక.తనూ వాళ్ళందరితో పాటూ నవ్వాడు.
రాయల వారి ప్రియ సఖి,చిన్న భార్య చిన్నాదేవి సభకు ఆనుకొని ఏర్పాటు చేసిన మందిరంలో ఉంటూ ఇదంతా వింటూ పద్యానికి పరమానంద భరితయై తన కంఠ హారం ధూర్జటికి బహుమతిగా పంపింది,రాయల వారు ముందు ఉపన్యాసంతో,తరువాత చమత్కారభరితమైన చాటువుతో అలరించిన ధూర్జటి పాండిత్యానికి,కవిత్వానికి ముగ్ధుడై

"స్తుతి మతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గేనో
అతులిత మాధురీ మహిమ?
అంటూ ఈ ధూర్జటి కవిత్వానికి ఇంత తియ్యదనం ఎలా వచ్చిందని సభికుల్ని అడిగాడు.ఆ సమస్యను అవకాశంగా తీసుకుని రామలింగడు ఇలా పూరించాడు
హా తెలిసెన్ భువనైక మోహనో
ద్దత సుకుమార వార వనితా జనితా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటం జుమీ"
అంటూ ధూర్జటి మాటలకు ఆ తియ్యదనం భువన మొహములైన వేశ్యల పెదవులు జుర్రుకోవడం వల్ల అని పూర్తి చేసి ధూర్జటి పరువు తీసాడు.ఈ పద్యానికి మెచ్చి రాయల వారి పట్టమహిషి తిరుమల దేవి(చిన్నా దేవికి పోటీగా కావచ్చు) తన కంఠ హారం బహుమతిగా రామలింగడికి సేవకురాలితో పంపించింది.

ఇంతకీ పై రెండు చాటువుల్లో ఏది గొప్పది అనే విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి.కానీ మహా పండితులే తేల్చ లేక వదిలేసారంటారు.నా మటుకు నాకు రామలింగడి చాటువు ఎక్కువ నచ్చుతుంది.

మీకు ఏది నచ్చింది?